పారిపోలేదు.. వడదెబ్బ తగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా : హీరో శివాజీ

శనివారం, 18 మే 2019 (15:39 IST)
టీవీ 9 షేర్ల  బదలాయింపులో అక్రమాలకు పాల్పడి పారిపోయినట్టు వస్తున్న వార్తలపై సినీ నటుడు శివాజీ స్పందించారు. తనకు గత కొన్ని రోజులుగా తనకు వడదెబ్బ తగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోను ఆయన శనివారం విడుదల చేశారు. 
 
టీవీ9-అలందా మీడియా మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు హీరో శివాజీ నోరు విప్పారు. తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ9-అలందా మీడియా మధ్య నెలకొన్న వివాదంపై మీడియాకు శివాజీ ఒక వీడియో విడుదల చేశారు. 
 
ఇందులో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, తాను ఎక్కడకు పారిపోలేదన్నారు. వడదెబ్బ తగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కానీ తాను పరారయ్యానని, తనను వెంటాడుతున్నారని కథనాలు రావడం బాధాకరమన్నారు. రవిప్రకాష్‌, తనకు మధ్య జరిగిన షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ అని.. అనవసరంగా దాన్ని క్రిమినల్ పంచాయితీ చేశారని వాపోయారు.
 
నిజానికి టీవీ 9లో కొన్ని షేర్లను గత యేడాదిలో కొనుగోలు చేశామని ఇపుడు యాజమాన్యం మారింది కాబట్టి షేర్ల గురించి అడిగానని తెలిపారు. ఇందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. మా ఒప్పందంలో జోక్యం చేసుకోడానికి కౌశిక్‌రావు ఎవరు? అని ప్రశ్నించారు. కౌశిక్‌రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నానా హంగామా చేశారన్నారు. సోదాలు చేసి ఏమీ దొరకలేదని తెలిపారు. తన భార్యతో సంతకం చేయించుకొని వెళ్లిపోయారని వివరించారు.
 
రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తనపై పగ పట్టిందన్నారు. ఇందులో కొంతమంది ఆంధ్రా నాయకులు కూడా ఉన్నారన్నారు. తాను హైదరాబాద్‌లో సెటిలర్‌నని, స్థానబలం లేదని అనుకుంటున్నారన్నారు. తనపై వంద కేసులు కాదు.. వెయ్యి పెట్టుకున్న భయమేమీలేదన్నారు. ఇవన్నీ సిల్లీ కేసులంటూ కొట్టిపారేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు