సదావర్తి భూముల కేసులో ఏపీ సర్కారుకు షాక్... సేల్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని ఆదేశం

మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:02 IST)
సదావర్తి భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని మంగళవారం న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
 
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నారు. అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
 
కేవలం కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగానే మార్కెట్ ధర కంటే తక్కువగా భూములు విక్రయించారంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సేల్ సర్టిఫికేట్‌లు ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు.

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

వెబ్దునియా పై చదవండి