బ్రహ్మంగారి మఠం వ్యవహారం... కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

శుక్రవారం, 16 జులై 2021 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారిని నియమిస్తూ ధార్మిక పరిషత్‌ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా జ‌ర‌గ‌లేద‌ని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
ముఖ్యంగా మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలని దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో ఇటీవ‌ల‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పీఠాధిపతి ఎంపిక వ్యవహారంపై ఏపీ హైకోర్టులో ఈ రోజు కూడా విచార‌ణ జ‌రిగింది. 
 
ప్రత్యేకాధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఈ సంద‌ర్భంగా న్యాయస్థానానికి చెప్పారు. అయితే, నిబంధనలకు అనుగుణంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 
 
ఈ కేసులో ఇరు ప‌క్షాల వాదనలు విన్న కోర్టు నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా బ్రహ్మంగారి మఠం వివాదం వార్తలకెక్కుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు