హిమబిందు అత్యాచారం.. హత్య కేసు : నిందితులందరూ నిర్దోషులే... కోర్టు తీర్పు

మంగళవారం, 28 జులై 2015 (18:24 IST)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యాంకు మేనేజర్ సతీమణి హిమబిందు హత్య కేసులోని నిందితులందరినీ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం విడుదల చేసింది. ఈ కేసులో నిందితులపై మోపిన నేరాభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందంటూ న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
విజయవాడలోని పటమట ప్రాంతంలో గత యేడాది మార్చి 15వ తేదీన బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందును గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని బందరు కాలువలో పడేశారు. ఈ ఘోరం మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన విజయవాడ పట్టణ పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేసి, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సరైన ఆధారాలు లేని కారణంగా నిందితులకు శిక్ష విధించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో పోలీసులు అనుసరించిన వైఖరిపై అపుడే విమర్శలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి