స్వర్ణ ప్యాలెస్ హోటల్ ప్రమాదానికి కారణం శానిటైజర్లే కారణమా?

సోమవారం, 10 ఆగస్టు 2020 (09:13 IST)
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటరుగా మారిన స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఆదివారం వేకువజామున భారీ అగ్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, ఈ హోటల్‌లో అగ్నిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కంప్యూటర్ గదిలో ఏర్పడిన విద్యుదాఘాతమని భావిస్తున్నారు. కానీ, ప్రాథమిక దర్యాప్తులో మాత్రం భారీ ఎత్తున నిల్వ చేసిన శానిటైజర్లు కారణంగా తెలుస్తోంది. 
 
ఈ కారణాలను పరిశీలిస్తే, స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో నాలుగు అంతస్తుల్లో కొవిడ్‌ బాధితుల కోసం 31 గదులు కేటాయించారు. మరో 10 గదుల్లో ఆస్పత్రి, హోటల్‌ సిబ్బంది ఉన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా ఉండటంతో హోటల్‌ను రోజూ డిస్‌ఇన్‌ఫెక్టెంట్లతో శుభ్రం చేస్తున్నారు. ప్రాంగణంలో శానిటైజర్లనూ పెద్దఎత్తున నిల్వ చేశారు. 
 
దీనికితోడు ఏడాది క్రితం ఈ హోటల్‌ను రీమోడల్‌ చేయించడానికి ప్లాస్టిక్‌ కాంపోజిట్‌ ప్యానెళ్లు వినియోగించారు. దీంతో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అవి శరవేగంగా వ్యాపించాయి. దట్టంగా అలముకున్న పొగతో గదుల్లో ఉన్నవారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కిటికీలు బద్దలు కొట్టుకుని పలువురు బాధితులు బాల్కనీలోకి వచ్చి రక్షించాలంటూ కేకలు వేశారు. 
 
రెండో అంతస్తులో విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు కిందకు దూకడంతో ప్రాణాలు దక్కినా ఆయన కాళ్లు విరిగిపోయాయి. మరో ముగ్గురు కొవిడ్‌ బాధితులు మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
ఘటనా స్థలిలోనే ఏడుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. మరో 21మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 31మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా 12మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు