అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో భూపాలపల్లి, సంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి, భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది.