మొదటి ప్రియుడ్ని వదిలించుకునేందుకు కొత్త ప్రియుడితో కలిసి 'అమ్మ'ను చంపేసింది...

గురువారం, 31 అక్టోబరు 2019 (15:47 IST)
మొదటి ప్రియుడిని వదిలించుకునేందుకు రెండో ప్రియుడుకు దగ్గరైంది. ఈ విషయం తెలిసిన తల్లి.. కుమార్తెను నిలదీసింది. చెడు తిరుగుళ్లు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని కుమార్తె.. తన రెండో ప్రియుడుతో కలిసి అమ్మను చంపేసింది. 
 
హైదరాబాద్ నగరంలోని ద్వారకా నగర్‌లో వివాహిత రజిత హత్య కేసులోని మిస్టరీని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా హతురాలి కుమార్తె కీర్తి, రెండో నిందితుడు ఆమె కొత్త ప్రియుడేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, యాదాద్రి జిల్లాకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి, రజిత దంపతులు. కూతురు కీర్తితో వలస వచ్చి హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మునుగనూరు గ్రామం ద్వారకానగర్‌లో నివాసం ఉంటున్నారు. లారీ డ్రైవర్‌ అయిన శ్రీనివాస్‌రెడ్డి 10 -15 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కూతురు కీర్తి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. 
 
అయితే, తండ్రి ఇంటిపట్టున లేకపోవడంతో కీర్తికి చెడు తిరుగుళ్లు అలవాటు అయ్యాయి. ఈ విషయం తెలిసిన తల్లి... ఆమెను మందలించింది. చెడు తిరుగుళ్ళు తిరుగొద్దని ఈ నెల 19వ తేదీన హితవు పలికింది. ఈ విషయంపై ఇద్దరు గొడవపడ్డారు. ఈ గొడవను మనసులో పెట్టుకున్న కీర్తి.. అదేరోజు రాత్రి ఇంటిపక్కనే ఉండే స్నేహితుడు శశిని పిలిచి తల్లి రజిత హత్యకు పథకం రచిందింది.
 
నిద్రపోతున్న తల్లి రజిత కాళ్లు, చేతులు పట్టుకోమని శశికి చెప్పిన కూతురు చీరతో తల్లికి ఉరి బిగించి చంపేసింది. ఇంటికి బయటి నుంచి తాళం వేసి తల్లి మృతదేహం ఉన్న ఇంట్లోనే శశితో మూడు రోజులు రహస్యంగా గడిపింది. నాలుగోరోజున దుర్వాసన వస్తుండటంతో శశి సాయంతో కారులో తన సొంతూరైన నీర్నాముల తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై పడేసింది. 
 
ఇంటికి తిరిగి వస్తూ హయత్‌నగర్‌లో నివసించే ప్రియుడు బాల్‌రెడ్డి తండ్రికి ఫోన్‌ చేసిన కీర్తి.. తల్లి రజితలాగా మాట్లాడి తాను, తన భర్త నల్లగొండ దవాఖానలో ఉన్నందున కూతురు ఇంట్లో ఒంటరిగా ఉందని చెప్పింది. తాము ఇంటికి రావడానికి రెండు, మూడురోజులు పడుతున్నందున అప్పటివరకు మీ ఇంట్లో ఉండనీయండని బతిమాలింది. నిజమని నమ్మిన బాల్‌రెడ్డి తండ్రి సరేననడంతో.. కీర్తి నేరుగా బాల్‌రెడ్డి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మరో మూడురోజులు గడిపింది. ఆ తర్వాత రైల్వే పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో టెక్నాలజీ కీలకంగా సాయపడింది. 
 
పట్టించిన ఫోన్ టెక్నాలజీ.. 
హత్య కేసును విచారించే సమయంలో పోలీసులు నిందితురాలు కీర్తి ఫోన్‌తోపాటు తల్లి రజిత, తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి, హత్యకు సహకరించిన స్నేహితుడు శశి, ప్రియుడు బాల్‌రెడ్డి ఫోన్‌ నంబర్ల లొకేషన్‌ను మ్యాపింగ్‌ చేశారు. ఈ సందర్భంగా మూడురోజులపాటు వైజాగ్‌ వెళ్ళినట్టు చెప్పిన కీర్తి ఫోన్‌ లొకేషన్‌ హయత్‌నగర్‌లో చూపించింది. దీంతో కీర్తి అబద్ధాలు చెప్తున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు... ఆమెను తమదైనశైలిలో ప్రశ్నించడంతో మొత్తం బండారాన్ని బయటపెట్టింది. 
 
కేసును తండ్రి మీదకు నెట్టేందుకు ప్రయత్నించిన కీర్తి.. సాంకేతిక సాక్ష్యాలను పోలీసులు ముందుకు తేవడంతో తల్లిని హత్య చేసినట్టు అంగీకరించకతప్పలేదు.కీర్తి, శశి, బాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది. ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం తప్పని చెప్పినందుకే తల్లిని హత్య చేసినట్టు కీర్తి వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు