జనసేన పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలికి చోటు...

ఠాగూర్

సోమవారం, 28 అక్టోబరు 2024 (10:23 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తాజాగా పోస్టింగులు ఇచ్చింది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర కమిషనర్‌తో పాటు అనేక కీలక పోస్టులను నిర్వహిస్తూ వచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి టీడీపీ సంకీర్ణ సర్కారు కూడా మంచి పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టురుగా నియమించారు. అంతేకాదు, ఏపీ పర్యాటక సంస్థ సీఈవోగా ఆమ్రపాలికి పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
అలాగే, ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ కూడా ఏపీలో రిపోర్ట్ చేశారు. వారికి కూడా ఇవాళ పోస్టింగులు ఇచ్చారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌‍గా వాకాటి కరుణను నియమించారు. ఈమెకు నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్‌ గానూ అదనపు బాధ్యతలు కేటాయించారు. వాణీ ప్రసాద్‌ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. వీరితోపాటు ప్రస్తుతం పురావస్తు శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జి.వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీస్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఏపీ పర్యాటక శాఖ జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేశ్ చేతిలో ఉంది. దీంతో ఆమ్రపాలికి పర్యాటక అభివృద్ధి బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తుంది. నిజానికి ఆమ్రపాలిని తన పేషీలోకి తీసుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించినట్టు ఆరంభంలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయన పేషీ కాకుండా తన పార్టీకి చెందిన మంత్రి బాధ్యతలు వహిస్తున్న పర్యాటక శాఖ అనుబంధ విభాగానికి ఎండీగా నియమించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు