ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? చంద్రబాబు ప్రశ్న

శనివారం, 14 నవంబరు 2020 (19:19 IST)
బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే. మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది" అన్నారు అబ్రహాం లింకన్. అంటే ప్రస్తుతం మనం మంచి పనులు చేస్తే.. రేపటి సమాజాన్ని కూడా మంచిగా ఉంచే బాధ్యతను పిల్లలు తీసుకుంటారన్నది లింకన్ ఉవాచ.
 
మన రాష్ట్రంలో పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం. తల్లిదండ్రులతో కలిసి బిడ్డల సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోంది. బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ ఇలాగే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోంది. చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉజ్వల భవిష్యత్తు ఉండేలా... యూనివర్సిటీలకు, పారిశ్రామిక వేత్తలకు, కంపెనీలకు వారధిగా మన విద్యావ్యవస్థను గత ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో తీర్చిదిద్దాం. 
 
అలాంటిది ఇప్పుడు అటు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇటు పరిశ్రమలను వాటాల కోసం బెదిరించి వెళ్ళగొట్టి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరం. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి.. రేపటి పౌరుల గురించి బాధ్యతగా ఆలోచించినప్పుడే అబ్రహం లింకన్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలు కలలుగన్న సమాజం సిద్ధిస్తుంది. చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు