రాష్ట్రంలో కులగజ్జిని వ్యాపింపచేసింది వైసీపీ ప్రభుత్వమే: అశోక్ బాబు

మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:21 IST)
ఇప్పుడున్నది రైతు ప్రభుత్వమే అయితే, రైతులకు కనీసం విత్తనాలుకూడా ఎందుకు అందించలేకపోయిందో,  ప్రతిపక్షటీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసేవరకు సకాలంలో రైతులతరుపున చెల్లించాల్సిన పంటలబీమా సొమ్ముని ఎందుకు చెల్లించలేదో, కేంద్ర ప్రభుత్వం చెప్పిన క్లెయిముల్లో సగానికి తక్కువే ఎందుకు చెల్లిస్తున్నారో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

మంగళవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...! 

తమప్రభుత్వం ఏంచేసినా ప్రజలు నమ్ముతారని ఆలోచించే పిచ్చి ఆలోచనలు మానుకుంటే మంచిది. చంద్రబాబునాయుడు కులరాజకీయాలు చేశాడని చెప్పడానికి సిగ్గుందా మీ ప్రభుత్వానికి. ప్రభుత్వసలహాదారులు సహా, 800కీలక పదవుల్లో రెడ్డివర్గం వారిని నియమించుకొని, చిన్నాచితకా ప్రాముఖ్యతలేని పదవులను ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు అంటగట్టింది మీరుకాదా?

మీకు తెలియకపోతే మాదగ్గరున్న సమాచారం పంపించమంటారా? నిజంగా ఈప్రభుత్వానికి బీసీలపై ప్రేముంటే, టీటీడీ ఛైర్మన్ పదవి తక్షణమే బీసీలకు ఇవ్వాలి. ఈప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలపై ప్రేముంటే, నిత్యం వారిపై ఎందుకు దాడులు చేస్తున్నారో శ్రీకాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. బ్రిటీషు వారి మాదిరే రాష్ట్రాన్ని మూడుముక్కలు చేసి, ముగ్గురు రెడ్లకు అప్పగించింది మీ ప్రభుత్వం కాదా?

ఈ ప్రభుత్వానికి ఉన్నకులగజ్జి, దేశంలో మరే ప్రభుత్వానికి లేదని మీకు మీరే నిరూపించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కులాలగురించి, సామాజికన్యాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీప్రభుత్వానికి, ఆపార్టీ నేతలకు ఉందా ?

రాయలసీమకు చంద్రబాబు ఏమీచేయలేదని చెప్పడానికి మీకు సిగ్గులేకపోయినా, పులివెందుల రైతులనుఅడిగితే, మీరు సిగ్గుతో తలొంచుకునేలా సమాధానం చెబుతారు. పులివెందులకు చంద్రబాబునాయుడు నీళ్లుఇస్తే, మీరు చుక్కనీరుఇవ్వకుండా సీమను ముంచేశారు. రాయలసీమకు కియామోటార్స్ ను తీసుకొస్తే, వైసీపీఎంపీ సదరుకంపెనీ వారిని బహరంగంగానే బెదిరించాడు.

రాయలసీమ ఏప్రభుత్వహయాంలో, ఎవరి పాలనలో అభివృద్ధిచెందిందో తెలియాలంటే, శ్రీకాంత్ రెడ్డి తక్షణమే బహరంగ చర్చనిర్వహించాలి. ఆచర్చకు రావడానికి మేము సిద్దమే. రాయలసీమకు చెందిన మేథావులను కూడా పిలవండి. రాయలసీమకు ఉపయోగపడే మిగులుజలాలు తమక అవసరం లేదని బచావత్ ట్రైబ్యునల్ కి లేఖరాసింది రాజశేఖర్ రెడ్డి కాదా?

పొద్దున్న లేచిన దగ్గర్నుంచి అబద్ధాలు చెబితే, సూర్యుడు చంద్రుడు కాడు, చంద్రుడు సూర్యుడుకాడని తెలుసుకోండి. 
18నెలలనుంచీ రైతులకు చెల్లించాల్సిన పంటలబీమా సొమ్ము చెల్లించకుండా నేడు, అరకొరగా రైతులఖాతాల్లో సొమ్ములు ఎందుకు వేశారో,  రైతులకుమేలుచేశామంటూ డబ్బాలు కొట్టుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. పత్రికల్లో ప్రకటనలిస్తే,మీ ప్రభుత్వం రైతుబంధు ప్రభుత్వం అయిపోదు. తుఫాను కారణంగా నష్టపోయిన పంటలెక్కల వివరాలను ఇంతవరకు ఎందుకు వేయలేకపోయారు? 

రాష్ట్రాన్నికులాలవారీగా విడదీసి, మీ కులానికే అన్నింటా ప్రాముఖ్యతనిచ్చి, రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.  అటువంటిమీరు కులాలు, సామాజిక న్యాయం గురించి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై గానీ, రాయలసీమకు చేసిన అభివృద్ధిపై గానీ చర్చకురావడానికి తాము సిద్ధంగానేఉన్నాము.

ఎక్కడ చర్చ పెడతారో పెట్టండి.. సాక్షి టీవీలోఅయినా సరే.  బీసీలకు, ఎస్సీ,ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయంచేసేవారే అయితే, టీటీడీఛైర్మన్ పదవిని తక్షణమే బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధిలో వైసీపీనేతలే ఫెయిల్ అయ్యారని వైసీపీనేతలే చెబుతున్నారు. వారి మాటలు, వ్యవహారాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయని స్పష్టంచేస్తున్నాను. 
 
రాష్ట్రంలో కులతత్వం రెచ్చగొట్టి, అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డికాదా? : సయ్యద్ రఫీ
ప్రభుత్వ పదోన్నతులకు రోస్టర్ విధానం ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలను ఒకపద్ధతిప్రకారమే నియమిస్తారని, దానికి విరుద్ధంగా రాష్ట్రంలో కులతత్వాన్నిరెచ్చగొట్టేలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వ్యవహరించాడు. డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో లేనిదాన్ని ఉన్నట్లుగా చూపతూ, చంద్రబాబుపై గతంలో విషప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్లు కాదా? 

తాను అధికారంలోకి వస్తే కులాభిమానం, కులతత్వం లేకుండా చేస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు 800 పదవులను తనవర్గానికే ఇచ్చుకున్నాడు. సీఎంపేషీలో కానీ, ప్రభుత్వ సలహాదారుల్లో కానీ ఒక్కరంటే ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన అధికారి ఉన్నాడా? లక్షల్లో జీతాలు పొందే పదవులు, అత్యంతముఖ్యమైన పదవులన్నీ తనవర్గానికే జగన్ కట్టబట్టాడు.

జీతాలు రాని, ప్రాధాన్యత లేని, ఆఖరికి కూర్చోవడానికి కుర్చీలుకూడా లేని ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులను మాత్రం ఇతర  వర్గాలకు అప్పగించాడు.  ఏదో ఇస్తున్నారుకాబట్టి, తీసుకోవాలనే ఆలోచనలో బీసీలు ఉన్నారని తెలుసుకోండి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనే భావనలో మిగతా వర్గాలు న్నాయి. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాకు ఏం శాఖ ఇచ్చారో చెప్పండి?

పేరుకు మైనారిటీ శాఖ ఇచ్చారు తప్ప, దానిలో పవర్ ఏమీలేకుండా చేశారు. హోంమంత్రికి ఏం పవర్ ఉందో ప్రజలంతా చూస్తున్నారుగా? మంత్రులంతా ఉత్సవవిగ్రహాలేనని, ఆడించేది అంతా జగన్ వర్గంవారేనని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. 

అమరావతే రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి, రాజధాని పూర్తయితే రాష్ట్రప్రజలు చంద్రబాబుని మర్చిపోరని గ్రహించి, కుళ్లు,కుతంత్రాలతో రాజధానిని చంపాలని చూశారు. మూడు రాజధానుల ప్రకటనలోని డొల్లతనం ఏమిటో, మీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలేమిటో ప్రభుత్వన్యాయ వాదే హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు.  బీజేపీ కూడా అమరావతికి మద్ధతుతెలిపింది. అంతమాత్రాన మోదీనికూడా విమర్శిస్తారా? 

అమరావతి ఉద్యమానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. కావాలనే  రాజధానిసహా, అనేక అంశాలపై శ్రీకాంత్ రెడ్డి లాంటివారు  దుష్ప్రచారం చేస్తున్నారు.   వైసీపీప్రభుత్వ నిర్వాకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారికి భయపడే ఎన్నికలకు వెళ్లడానికికూడా ప్రభుత్వం భయపడుతోంది.  తిరుపతి ఉపఎన్నిక మాదిరే, ప్రభుత్వం స్థానికఎన్నికలు నిర్వహిస్తే, ప్రజలుఎవరిపక్షాన ఉన్నారో తేలిపోతుంది.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ఉపాధికోల్పోయి, ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధిచెబుదామా అని ఎదురుచూస్తున్నారు. విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమకు కేంద్రం నుంచి రావాల్సిననిధులను వైసీపీప్రభుత్వం ఎందుకు తేలేకపోయిందో శ్రీకాంత్ రెడ్డి చెప్పాలి. కులాభిమానంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం ఇకనుంచైనా కులాలప్రస్తావన చేయకుండా ఉంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు