ఈ దఫా కోర్టు అక్షింతలతో పాటు చర్యలు తప్పవేమో... : ఐవైఆర్

గురువారం, 19 నవంబరు 2020 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఒకవైపు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు, ఈ ఎన్నికలను ఏ విధంగానైనా అడ్డుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. దీంతో ఏపీలో మరోమారు రాజ్యాంగ సంక్షోభం ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఉమ్మడి ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కృతనిశ్చయంతో ఉండగా, ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ససేమిరా అంటోంది. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ తమ వైఖరితో మరో రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్వీట్ చేశారు.
 
రాజ్యాంగంలో పొందుపరిచిన అనుకరణ ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఎస్ఈసీదేనని తేల్చిచెప్పారు. ఎన్నికలు జరిపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం అంటే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది అని కాదని విశదీకరించారు. 
 
ఎన్నికల అంశంపై రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడితే ఈసారి కోర్టు అక్షింతలతో ఆగకపోవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వివేకరహితంగా ఉన్నాయని విమర్శించారు.
 
మరోవైపు, ఎస్ఈసీ నిమ్మగడ్డను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. ఈ లేఖలో కొడాలి నానిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
 
ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. 
 
ఈ లేఖతో పాటు ఈసీని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, వీడియో క్లిప్పింగులను కూడా గవర్నరుకు పంపారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు