రాష్ట్రానికి ముప్పు... ఎంఫాన్ తుఫానుతో జాగ్రత్త.. సీఎం జగన్

సోమవారం, 4 మే 2020 (23:25 IST)
రాష్ట్రానికి ముప్పు పొంచివుందని.. ఎంఫాన్ తుఫాను విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. తుఫాను వస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సముద్రంలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. తుపాను వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
 
తుఫాను మన రాష్ట్రం వైపు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుఫానును దృష్టిలో ఉంచుకుని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. 
 
పంటలో మూడింట ఒక వంతును ప్రభుత్వమే కొనుగోలు చేస్తే... ధరల స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు. పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడకు పంపాలని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. 
 
ఇంకా, అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారి ఏపీ దిశగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల రెండో వారం నాటికి తుఫాను ఏపీ తీరం సమీపానికి రావొచ్చని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ తుపానుకు 'ఎంఫాన్' అని నామకరణం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు