కార్మికుల కోసం పని చేసే ప్రభుత్వానికి అండగా ఉంటాం : పవన్ కళ్యాణ్

ఆదివారం, 3 మే 2020 (18:14 IST)
కార్మికుల కోసం పని చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు స్పష్టం చేశారు. అదేసమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం, తితిదేలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఊరట కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
 
గత 15 యేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో 1400 మంది ఔట్‌సోర్సింగ్ విభాగంలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిని తితిదే ఉన్న ఫళంగా తొలగించింది. దీనికి ఏపీ సర్కారు కూడా మద్దతు ప్రకటించింది. ఈ విషయం పవన్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. 
 
1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికుల పొట్ట కొట్టొద్దు. కరోనాతో అల్పాదాయ వర్గాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడం సరికాదు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
'దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి' అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. అయినా తితిదే పెద్దలు ఒక్క కలం పోటుతో వారిని తొలగించారు. ఈ చర్య సహేతుకం కాదు. పైగా, టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. వారందరినీ కొనసాగించాలి, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ బోర్డు, ఈఓలకు ఇదే నా విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. 
 
దీనిపై ఇటు జగన్ సర్కారు, అటు తితిదేలు స్పందించాయి. 1400 మంది కార్మికులను కొనసాగించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. దీనికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సర్కారు, తితిదే తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని పేర్కొన్నారు. 
 
కార్మికులను విధుల్లోకి తీసుకుని మానవత్వం చాటారని కొనియాడారు. వారంతా శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా కొద్దిపాటి వేతనాలకే పారిశుద్ధ్య సేవ చేస్తున్నారని పవన్ వెల్లడించారు. కార్మికుల కోసం ప్రభుత్వం చేసే ప్రతిపనికీ జనసేన సహకారం ఉంటుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు