బ్లాక్ మ‌నీని వైట్ చేయాలంటే... చంద్ర‌బాబును సంప్ర‌దించండి... జ‌గ‌న్

సోమవారం, 7 నవంబరు 2016 (22:04 IST)
విశాఖ ‌: నల్ల ధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చుకోవాలనే విషయం చంద్రబాబు దగ్గర నుంచే నేర్చుకోవాలని వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్’ సంస్థ షేర్ ధరలు ఒకప్పుడు మామూలుగా ఉండేవ‌ని, ఈ రోజున ఆ సంస్థ షేర్ ధర 450 రెట్లకు పెరిగిపోయిందని విమర్శించారు. దేశం మొత్తంమీద చూస్తే అత్యాచార నిందితుల్లో నలుగురు మంత్రి పదవుల్లో ఉన్నారని, అందులో ఇద్దరు మంత్రులు మన రాష్ట్రం నుంచే ఉండటం ‘మన కర్మ’ అంటూ జగన్ ఆరోపించారు. సువర్ణాంధ్రప్రదేశ్ సంగతి దేవుడెరుగు, మద్యాంధ్రప్రదేశ్, అవినీతాంధ్రప్రదేశ్‌గా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్న చంద్రబాబును జైళ్లో పెట్టినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
‘చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎవరు సంతోషంగా ఉన్నారు?’ అని తాను ప్రశ్నిస్తున్నానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సూటిగా ప్రశ్నించారు. ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, కార్మికులు, కూలీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...ఎ వ్వరూ చంద్రబాబు పాలనలో సంతోషంగా లేరన్నారు. కనీసం, ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు అయిన తర్వాత కూడా నష్టాల బాటలోనే ఉంది, రెండున్నరేళ్లలో ఒక్క భారీ పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా? అని జగన్ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి