మావోడికి కోపం వచ్చింది.. గవర్నర్ - ఎస్ఈసీలను వద్దంటారేమో? : జేసీ వ్యంగ్యాస్త్రాలు

సోమవారం, 16 మార్చి 2020 (14:44 IST)
మావోడికి కోపం కట్టలు తెంచుకుంది. అందువల్ల రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థతో పాటు.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా రద్దు చేయొచ్చు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్. రమేష్ కుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే అదే సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు చెప్పినట్టుగా ఆడుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఎస్ఈసీకి కులాన్ని అంటగట్టారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి సోమవారం దివాకర్ రెడ్డి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఒక భస్మాసురుడు ఉన్నాడని.. తన నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నాడని అన్నారు. ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 
 
రాష్ట్రంలో గవర్నర్, ఈసీ ఎవరూ ఉండకూడదని జగన్ భావిస్తున్నారని జేసీ అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి... పక్కన పోలీసులు ఉంటే సరిపోతుందనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేయడం మంచి నిర్ణయమన్నారు. జగన్ చాలా తెలివైనవాడంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. సామాజికవర్గం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుందని... అది లేని వారు ఎవరో చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు