పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించాలి.. రోజు చచ్చి బతికే కన్నా యుద్ధమే శరణ్యం: జేసీ

ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (16:46 IST)
పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించాలని, పాకిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో పది కోట్ల మంది ప్రజలు చనిపోయినా చింతలేదని, అఖండ భారత్‌గా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

రోజూ చచ్చి బతికే కన్నా యుద్ధమే శరణ్యమని జేసీ వెల్లడించారు. కులపిచ్చితో అనంతపురం మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తున్నారని, మునిసిపాలిటీలో అవినీతిపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 
 
జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తప్పిదం వల్లే పాకిస్థాన్ ఏర్పాటైందని జేసీ దివాకర్ వ్యాఖ్యానించారు. సైన్యానికి ఖర్చు పెట్టే వేల కోట్లతో దేశంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చునని జేసీ తెలిపారు. అప్పటి నేతలు దూరదృష్టితో ఈ పరిస్థితిని ఊహించలేకపోయారని, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని దివాకర్ రెడ్డి కోరారు.

వెబ్దునియా పై చదవండి