టీచర్స్ ఎమ్మెల్సీగా కల్పలత ప్రమాణ స్వీకారం

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యురాలిగా టి.కల్పలత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని  శాసనమండలి చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ గుంటూరు - కృష్ణా జిల్లాల స్వతంత్ర  టీచర్స్ ఎమ్మెల్సీ నూతన సభ్యురాలిగా ఎంపికైన   టి.కల్పలత  చేత  ప్రమాణం చేయించారు. 
 
అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, శాసన మండలికి సంబంధించిన నియమ, నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్, అసెంబ్లీ కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు, అసెంబ్లీ  ఒఎస్ డి కె.సత్యనారాయణ, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ విజయరాజు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు  కె.వెంకటరామిరెడ్డి, నూతన ఎమ్మెల్సీ  కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.
 
విద్యా, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషిచేస్తా : 
గుంటూరు, కృష్ణా జిల్లాల శాసన మండలి సభ్యురాలిగా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన టీచర్లకు నూతన శాసన మండలి సభ్యురాలు కల్పలత ధన్యావాదాలు తెలిపారు. శాసనమండలి ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన గెలుపుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రచార సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పని చేస్తానని అన్నారు. 
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లకు ఆమె రుణపడి ఉంటానన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు,మోడల్ స్కూల్స్,కస్తూరి బా స్కూల్స్, కాంట్రాక్టు ఉపాధ్యాయులు,టీచర్లు,ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పని చేస్తానని పేర్కొన్నారు.తన గెలుపు కోసం 43 ఉపాధ్యాయ సంఘాలు పనిచేశాయని అందుకు సర్వదా రుణపడి విద్యాభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు