కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఆనందంగా ఉంది : కింజెరపు రామ్మోహన్

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (19:20 IST)
కేంద్రమంత్రి వర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న ఆయన ఎక్స్‌లో వీడియో సందేశం విడుదల చేశారు. 'ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉన్నాయి. ఆయన ఆశీర్వాదమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నాకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తున్న మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, సోదర భావంతో చూస్తున్న లోకేశ్‌ అన్న, పవన్‌ కల్యాణ్‌, నరేంద్రమోదీ, ముఖ్యంగా మా బాబాయి అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేసి నేను మూడు సార్లు గెలవడానికి కారణమయ్యారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మరో ప్రధాన కారణం మా శ్రీకాకుళం ప్రజలు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంత వరకూ తీసుకొచ్చాయో ఈ రోజు అంతా చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. 
 
తెలుగు ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మనందరికీ చాలా ఉజ్వలంగా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు లభించిన ఈ మంత్రి పదవి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలదని మరో సారి గుర్తు చేస్తున్నా. తెలుగు ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా వారి కోసం మేం పనిచేస్తూ వచ్చాం. వచ్చే ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో మీకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున శక్తివంచన లేకుండా పనిచేసి మీకందరికి న్యాయం చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడతాం. ఏపీని అభివృద్ధి పఠంలో నిలిపి, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తయారు చేయాలనేదే మా అందరి లక్ష్యం' అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు