శ్రీలక్ష్మి అవినీతి బాగోతాన్ని వెలికి తీస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

వరుణ్

శుక్రవారం, 2 ఆగస్టు 2024 (16:53 IST)
ఏపీ పురపాలక శాఖ పూర్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రజా ధనంతో నిర్మించిన పార్కుకు తన తండ్రి పేరు పెట్టిన అంశంతో పాటు ఆమె అవినీతినంతా వెలికి తీస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో బందరులో పంచాయతీరాజ్ కాలనీలో రూ.2.18 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన పార్కుకు శ్రీలక్ష్మి తన తండ్రి పేరు పెట్టడం, ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై 'శ్రీలక్ష్మి.. నీ మహిమలూ' శీర్షికన గురువారం ఓ దినపత్రికలో వార్త వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. 
 
మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, శ్రీలక్ష్మి కలిసి ప్రజల డబ్బుతో నిర్మించిన పార్కులో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ నిధుల నుంచి రూ.2 కోట్లు నగరపాలిక నుంచి రూ.18 లక్షలు ఖర్చు చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. తండ్రి విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఉంటే శ్రీలక్ష్మి సొంత ఖర్చుతో పెట్టుకోవాలని గతంలోనే చెప్పామన్నారు. టీడీపీ హయాంలో బందరులో పార్కులను అభివృద్ధి చేస్తే జగన్ ప్రభుత్వం వాటిని అధ్వానంగా చేసిందని విమర్శించారు.
 
టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ కాలనీ పార్కుకు కొనకళ్ల గణపతి పేరు పెట్టాలని భావించి, మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానిస్తే.. వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పార్కుల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని, ఎంత ఖర్చు చేశారో.. ఎంత తిన్నారో మొత్తం బయటకు కక్కిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు