రెడ్ బుక్ ఇంకా తెరవలేదు.. అపుడే జగన్ గగ్గోలు పెడుతున్నారు : మంత్రి నారా లోకేశ్

సెల్వి

శనివారం, 27 జులై 2024 (14:28 IST)
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను, నేతలను, వేధించిన వైకాపా నేతలు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల అధికారుల పేర్లను రాసిన రెడ్ బుక్‌ను ఇంకా ఓపెన్ చేయలేదని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. కానీ, మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అపుడే గగ్గోలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఇటీవల ఢిల్లీలో జగన్ ధర్నా చేసిన విషయం తెల్సిందే. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, ఢిల్లీలో జగన్ లేవనెత్తిన రెడ్ బుక్ గురించి చెప్పాలంటే.. అదేమీ రహస్యం కాదన్నారు. తన వద్ద ఆ పుస్తకం ఉన్నట్టు దాదాపు 90 సభల్లో చెప్పానని గుర్తు చేశారు. తప్పుచేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
 
నిజానికి తానింకా రెడ్ బుక్‌ తెరవనే లేదన్నారు. గతంలో జగన్ ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ఇవ్వాలన్న అంశంపై స్పందించమని జాతీయ మీడియా కోరితే.. విజయసాయి రెడ్డి మాట్లాడతాడంటూ వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు అదే మీడియాను బతిమాలి పిలిపించుకుని మరీ రెడ్ బుక్‌కు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో రెండంటే రెండుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్... ఎన్నికల్లో ఓటమి తర్వాత గత నెల రోజుల్లో ఐదు ప్రెస్‌మీట్లు పెట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. వీటిలో మాట్లాడే అబద్ధాలేవో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తాము సమాధానం ఇస్తామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు