గుంటూరులో సెప్టెంబ‌రు 11న లోక్ అదాల‌త్

బుధవారం, 18 ఆగస్టు 2021 (14:52 IST)
గుంటూరు జిల్లాలో ప‌లు కేసులు పెండింగ్ ప‌డిపోతున్నాయ‌ని, వాటి ప‌రిష్కారానికి మ‌రోసారి లోక్ అదాల‌త్ ఏర్పాటు చేస్తున్నామ‌ని జిల్లా న్యాయమూర్తి కె. రత్నకుమార్ చెప్పారు. గుంటూరులో జిల్లా న్యాయ‌మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు తెలియ‌జేశారు.

పెండింగులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సెప్టెంబర్ 11న మరోసారి లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20 నుండి 25 బెంచ్ లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. కోర్టుకు హాజరు కాలేని పరిస్థితుల్లో డిజిటల్, వ‌ర్చువల్ విధానం ద్వారా సంప్రదించే అవకాశం కూడా ఉందని తెలిపారు. గత లోక్ అదాలత్ లో 2,266 కేసులను పరిష్కరించామేని, ఈసారి అంతకన్నా ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామ‌న్నారు. సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సమస్యలు, స్థలాల సమస్యల వంటి కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాల‌న్నారు.

రెండు లక్షల లోపు చెక్ బౌన్స్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామ‌ని తెలిపారు. ఒక్కసారి లోక్ అదాలత్ లో సమస్య పరిష్కారం అయితే, అదే తుది తీర్పుగా పరిగణించబడుతుంద‌ని, ఇందులో ఎవ్వరూ ఓడినట్లు కాద‌న్నారు. గుంటూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకొని తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల‌ని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు