సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

ఠాగూర్

సోమవారం, 31 మార్చి 2025 (11:13 IST)
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని చర్యను అడ్డుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాళ్లూరు మండలంలోని విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్‌ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి 12 యేళ్ల క్రితం ఊరి శివారులోని తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవల ఆలయం ముందు పెద్ద గొయ్యి తవ్విన ఆయన వారం రోజులుగా ఆ గొయ్యిలోకి వెళ్ళి పైన రేకు కప్పుకుని ధ్యానం చేయసాగాడు. 
 
ఈ క్రమంలో ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా, ఆదివారం తెల్లవారుజామున కుమారుడుతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోటిరెడ్డి గొయ్యిలోకి దిగి ధ్యానంలో మునిగిపోయాడు. వెంట వెళ్లిన కుమారుడు ఆ గొయ్యిపై రేకు ఉంచి దానిపై మట్టిపోసి పూడ్చేశాడు. ఈ విషయం తెలిసిన కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి గ్రామస్థులతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని కుమారుడిని బయటకు రావాలని కోరారు. అయితే, తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి కోరాడు. 
 
మరోవైపు, సజీవ సమాధికి సంబంధించిన సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని గొయ్యి నుంచి వెలికి తీశారు. అయితే, వారు వెళ్లిపోయిన తర్వాత మరోమారు ఆయన గొయ్యిలోకి దిగి ధ్యాయం చేయసాగాడు. చివరకు కుటుంబ సభ్యులు, స్థానికులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు