తిరుమలలో ప‌ర్యా‌వ‌ర‌ణ ప‌రిరక్షణ కోసం భారీగా స్వ‌దేశీ మొక్క‌ల పెంప‌కానికి చర్యలు

గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:39 IST)
క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమ‌ల‌ శేషాచ‌ల అడ‌వుల‌లో  వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని  పరిరక్షించేందుకు భారీగా స్వదేశీ అట‌వీ వృక్ష సంప‌ద‌ను ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 
 
శేషాచ‌ల అడ‌వుల‌లోని ఆస్ట్రేలియా తుమ్మ మొక్క‌ల స్థానంలో స్వదేశీ జాతుల  మొక్కలను పెంచడానికి నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మ మొక్క‌లు  తిరుమల అడవుల జీవవైవిధ్యాన్ని అస్తిర‌త ప‌రుస్తున్నాయ‌న్నారు.

అన్ని ర‌కాల గ‌డ్డి జాతులు, పొద‌లు, తీగ‌జాతి, వృక్ష‌జాతి మొక్క‌లను భారీగా ‌పెంచ‌డానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల‌న్నారు. గ‌తంలో జ‌రిగిన పొర‌పాటును నివారించ‌డంలో భాగంగా ప్ర‌జ‌లు, శాస్త్ర‌వేత్త‌ల స‌హాకారంతో ద‌శ‌ల వారిగా రాబోవు 10 సంవ‌త్స‌రాల్లో ఆస్ట్రేలియా తుమ్మ మొక్క‌ల స్థానంలో స్వ‌దేశీ జాతుల మొక్క‌లు పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  
 
తిరుమ‌ల‌లో ఆస్ట్రేలియా తుమ్మ మొక్క‌ల చ‌రిత్ర‌   :
శేషాచ‌ల అడ‌వుల‌లో తుమ్మ తోట‌ల పెంప‌కం 1983వ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైంది. ఆస్ట్రేలియా మొక్కల జాతికి చెందిన తుమ్మ‌ ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగింది. రాతి నేల‌లు, ఏడారుల‌లో తుమ్మ చెట్లు తక్కువ నీటితో పెరుగుతున్నందున వేగంగా అభివృద్ధి చెందే జాతిగా పరిగణించబడింది.

ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రవేత్తలు ఈ జాతి మొక్క‌లు ఇతర వృక్షజాలం, జంతుజాలాల‌ను తీవ్రంగా దెబ్బతీశాయ‌ని గుర్తించి అనేక దేశాలు ఇప్పుడు తుమ్మ మొక్క‌ల పెంప‌కాన్ని నిషేధించాయి.
 
ధర్మగిరి, కుమారధార-పసుపుధార అడవులలో ఈవో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా తుమ్మ మొక్క‌లు ఉన్నచోట ఇత‌ర జాతుల మొక్క‌ల పెరుగుదల లేద‌ని, పక్షులు, జంతువుల కదలికలు లేక‌పోవ‌డాన్ని గమనించి, కారణాన్ని తెలుసుకోవడానికి నిపుణుల అభిప్రాయాన్ని కోరారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య ఛైర్మన్ డాక్ట‌ర్ డి.ఎమ్‌.కె.రెడ్డి, మరికొందరు ప‌రిశోధ‌కులు శేషాచల అడ‌వుల‌లో పచ్చదనం క్షీణించడానికి తుమ్మ చెట్లు కార‌ణ‌మ‌ని నివేదిక‌లో వివ‌రించారు.
 
తుమ్మ మొక్క‌ల గురించి వారు పేర్కొన కొన్ని వాస్తవాలు :
 తిరుమల శేషాచల అటవీ విస్తీర్ణంలో సుమారు 890 హెక్టార్లలో తుమ్మ చెట్ల‌ను పెంప‌కం జ‌రిగింది.
 
- దాని పిహెచ్ విలువ 4.4 మరియు 4.5 మధ్య ఉన్నందున, ఈ అధిక ఆమ్లత కారణంగా సార‌వంత‌మైన నేల‌లను నాశ‌నం చేస్తుంది.
 
- తుమ్మ మొక్క‌లను జంతువులు లేదా పక్షులు ఆహారంగా తీసుకోవు. తేనెటీగ కూడా దాని పుప్పొడి నుండి తేనెను రవాణా చేయదు, ఇది చివరికి ఇతర మొక్కలకు ఆటంకం కలిగిస్తుంది మరియు జంతువుల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
 
- అంతేకాకుండా తుమ్మ మొక్క‌లు వెదురు తర్వాత వేగంగా పెరుగుతున్న జాతులు. అది తేలికగా అగ్నిని ఆకర్షించి అగ్ని ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతుంది.
 
-  గత మూడున్నర దశాబ్దాల్లో శేషాచ‌ల అడ‌వుల‌లో విస్తృతంగా పెరిగిన తుమ్మ‌ కారణంగా, దాదాపు 76 తీగ జాతు‌లు, 49 మొక్కల జాతులు అంతరించిపోతున్న జాబితాలో చేరాయి. ఇది తిరుమల పచ్చదనం, జీవావరణ శాస్త్రం మరియు అడవి జీవితంపై ప్రభావం చూపుతున్న భయంకరమైన పరిస్థితి.
 
ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడం :
ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడానికి, తుమ్మ‌ స్థానంలో దేశీయ మొక్కల జాతులను విస్తృతంగా పెంచాలని టిటిడి నిర్ణయించింది. తుమ్మ‌ స్థానంలో 994 రకాల మొక్కల జాతులను అటవీ విభాగం అధికారులు గుర్తించారు. ఇందులో ఫికస్ రిలిజియోసా (రావి), ఫికస్ బెంగాలెన్సిస్ (మర్రి), ఫైకస్ వైరెన్స్ (జువ్వి), మాగ్నోలియా ఛంప‌కా (సంపంగి), మధుకా లాంగిఫోలియా (ఇప్పా), టెర్మినాలియా అర్జున (మడ్డి), సిజిజియం క్యుమిని (నేరేడు), లిమోనియా యాసిడిసిమా (వెలగ) త‌దిత‌రాలున్నాయి.
 
టిటిడి డిఎఫ్‌వో చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ తుమ్మ చెట్లు వ్యాప్తి చెందిన 890 హెక్టార్లలో  650 హెక్టార్లలో స్వ‌దేశీ జాతి మొక్క‌ల‌తో దశలవారీగా ఏర్పాటు చేస్తామ‌న్నారు. మిగిలిన 240 హెక్టార్లలో తుమ్మ‌ను అలాగే ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వ్య‌యం మొత్తం రూ.20 కోట్లుగా అంచనా వేసిన‌ట్లు చెప్పారు. మొదటి దశలో 2021-22లో 80 హెక్టార్ల భూమిలో స్వ‌దేశీ జాతుల మొక్క‌లు పెంచుతామ‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు