మంత్రి లోకేష్ 34 ఏళ్ళ వయస్సులో భార్యాబిడ్డలకు దూరంగా వుంటున్నారు... మంత్రి కళా

గురువారం, 15 మార్చి 2018 (18:10 IST)
అమరావతి: రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రులందరూ ఏకమై కేంద్రంపై వత్తిడి తెచ్చి హోదాతో పాటు విభజన చట్టంలోని 18 హామీలు సాధించుకోవాలని ఉద్యమాలు చేస్తుంటే ఆంధ్రుల ఆకాంక్షల కోసం ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులచేత రాజీనామా చేయించి రోజూ ఎంపీల చేత పార్లమెంటును స్తంభింపచేస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం.. ఎవరి ప్రయోజనాల కోసం నిరాధార నిందలు చేస్తున్నారని మంత్రి కళావెంకట్రావు విమర్శించారు. 
 
గురువారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంత్రి కళావెంకట్రావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధినేత ప్రసంగం తీరు విడ్డూరంగా ఉందని... జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్రానికి ఏమి చేస్తారో పవన్ చెప్పలేదని, అసలు జనసేన పాలసీ ఏంటి? టీడీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పుడు టీడీపీపై విమర్శల వెనుక పవన్ కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివే ముందు పవన్ కళ్యాణ్ ఒక్కసారి అయినా ఆలోచించుకోవాలని మంత్రి హితవు పలికారు. 
 
రాష్ట్ర ప్రయోజనం కోరే పార్టీ ఏదైనా కేంద్రాన్ని టార్గెట్ చేయాలే గాని సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. నిన్న ఆవిర్భావ సదస్సులో పవన్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించకుండా సీఎం కుటుంబంపై నిరాధార నిందలు వేయడం ఎవరి స్క్రిప్టుతో చేస్తున్నారో 5 కోట్ల ఆంధ్రులకు అనుమానం కలిగిస్తున్నది. హోదా ఇవ్వాల్సిన మోడీ గారిని ఒక్కమాట కూడా అనకుండా ముఖ్యమంత్రిపై దాడి కేంద్రీకరించడం బాధాకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. 
 
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన నారా లోకేష్, తాత, తండ్రి వలే ప్రజాసేవ నిమిత్తం సుఖమైన జీవితాన్ని వదలి 34 ఏళ్ళ వయస్సులో భార్యాబిడ్డలకు దూరంగా వుంటూ గ్రామాల అభివృద్ధికి, ఐటీ రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్న లోకేష్ పైన నిరాధార నిందలేయడమంటే యువశక్తిని నిర్వీర్యంచేయడం కాదా అని మంత్రి ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు