మా డాడీకి 2.5 మార్కులే వేస్తారా? వాపోతున్న ఏపీ మంత్రి!

మంగళవారం, 20 మార్చి 2018 (14:25 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. మా డాడీ రేయింబవుళ్ళు కష్టపడుతుంటే 2.5 మార్కులే వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం అమరావతిలో మీడియాతో‌ పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
రాజధాని లేని రాష్ట్రానికి కేరాఫ్ అడ్రస్ ఇచ్చామన్నారు. మేము ప్రతి రోజు రాత్రి 11 వరకు కష్టపడుతున్నాం. సీఎం అంత కష్టపడుతుంటే 2.5 మార్కులు వేస్తారా?. పోలవరం నిధులు అథారిటీ ద్వారా ఖర్చు పెడతారని, ఆ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉందని గుర్తు చేశారు. 
 
అలాగే, గుంటూరు వేదికపై తనపై ఆరోపణలు చేసిన పవన్‌.. టీవీ ఇంటర్య్వూలో ఎవరో చెబితే చేశానని అంటున్నారని లోకేష్ అన్నారు. పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా వేసే విషయంపై పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. 
 
ఏపీ ప్రజలు చాలా తెలివైన వారనీ, ఎవరేంటో వారికి బాగా తెలుసన్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ సర్టిఫిటేక్ తమకు అవసరం లేదన్నారు. అంతేకాకుండా, తాము జగన్‌పై తాము చేసిన ప్రతి అవినీతిని నిరూపించామన్నారు. అపుడు జగన్.. ఇపుడు పవన్ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 
 
కాగా, ఓ న్యూస్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు పదికి 6 మార్కులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనకు 10కి కేవలం 2.5 మార్కులు మాత్రమే ఇచ్చిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు