అంబులెన్స్ డ్రైవర్ అవతారమెత్తిన నగరి ఎమ్మెల్యే

మంగళవారం, 7 జులై 2020 (16:11 IST)
సినీ నటి ఆర్కే.రోజా. ఇటు రాజకీయాల్లో రాణిస్తూనే, అటు బుల్లితెరపై జడ్జిగా రాణిస్తోంది. ప్రస్తుతం అధికార వైకాపా తరపున నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల సంస్థకు ఛైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈమె ప్రస్తుతం అంబులెన్స్ డ్రైవరుగా మారిపోయారు. అందులోనూ 104, 108 అంబులెన్స్  డ్రైవరుగా మారారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆధునిక సౌకర్యాలతో కూడిన 108, 104 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఆ వాహనాలన్నీ జిల్లాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గంలో  108, 104 వాహనాలను ప్రారంభించారు. 
 
ఈ క్రమంలో ఓ 108 అంబులెన్స్‌ను రోజా స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆమె ట్రాఫిక్‌లో సైతం అలవోకగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లారు. మొన్నటికి మొన్న మంత్రి పేర్ని నాని కూడా అంబులెన్స్‌కు డ్రైవరుగా మారిన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, చంద్రబాబుపైనా, టీడీపీపైనా ధ్వజమెత్తారు. మంచి పనులు చేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంటుంటే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు తిన్నది అరక్క ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు