పలాసలో జేసీబీతో కరోనా మృతదేహాన్ని తరలించిన అధికారులు.. వీడియో వైరల్

శనివారం, 27 జూన్ 2020 (15:07 IST)
JCB
శ్రీకాకుళంలో ఘోరం జరిగింది. కరోనాతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం జేసీబీతో తరలించారు. ఏపీ, శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వ అధికారులు డోర్ టూ డోర్ హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మున్సిపాలిటీకి చెందిన ఓ మాజీ ఉద్యోగి(72)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతను ఇటీవలే చనిపోయాడు. అయితే ఆ వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు జేసీబీ మిషన్‌లో తరలించారు. 
 
ఈ దృశ్యాలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అధికారులేమో పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం కాస్త ఏపీ సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన ఇది అమానవీయ చర్య అని సీఎం పేర్కొన్నారు. 
 
మృతదేహాన్ని జేసీబీలో తరలించేందుకు ప్లాన్ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఎన్ రాజీవ్‌ను సస్పెండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు