జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు నన్నపనేని రాజకుమారి ఎదురుచూపులు... ఎందుకబ్బా?

మంగళవారం, 28 మే 2019 (13:43 IST)
ఎపీ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు వరుస కడుతున్నారు. కొత్త ప్రభుత్వంలో పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్టు జగన్ చెవిలో వాపోతున్నారు. 
 
ఇదిలాఉంటే తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఢీలా పడిపోవడం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఓటమి చెందడంతో తమ రాజకీయ మనుగడ కోసం కొందరు తెలుగుదేశం నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ మరోమారు అధికారంలోకి రావడంతో అటువైపుగా కొందరు తెలుగుదేశం నేతలు చూస్తున్నట్టు సమాచారం. 
 
గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణతో రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయాన్ని పత్తిపాటి పుల్లారావు  ఖండించారు. ఇక ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తాడిపూడిలో క్యాంపు ఆఫీసులో జగన్‌ను కలవడానికి రావడంతో ఈ కలయికకు ప్రాధాన్యత సంతరిచుంకుంది.
 
ఐతే అప్పటికే జగన్ క్యాంపు ఆఫీసు నుంచి తమ ఇంటికి వెళ్లిపోవడంతో నన్నపనేని రాజకుమారి జగన్‌ను కలవకుండానే వెనుదిరిగారు. నన్నపనేని రాజకుమారి కుమార్తె నన్నపనేని సుధ 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి వై.సీ.పీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే నన్నపనేని రాజకుమారి కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారా? లేక మరేదైనా కారణమా అనే అంశాలు తెలియాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు