అసంపూర్తిగా ఉన్న నాడు నేడు పనులు జూన్ 20నాటికి పూర్తి చేయాలి: ఆదిమూలపు సురేష్

మంగళవారం, 25 మే 2021 (18:25 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న మనబడి నాడు నేడు కార్యక్రమం మొదటి విడత పనులు తక్షణమే జూన్ 20వ తేదికి పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.

మొదటి విడత పనుల్లో చాలావరకు పూర్తి అయినప్పటికీ మిగిలిన అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయటం ద్వారా రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉందని అయన అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి సురేష్ అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్,ఎస్ పి డి వెట్రిసెల్వి, డైరెక్టర్ చిన్నవీరభద్రుడు, ఈఎన్ సిలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
 
నాడు నేడు పనుల్లో భాగంగా ప్రహరీ ల నిర్మాణం అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 557  ఉండగా అందులో 382 పూర్తయ్యాయని మిగిలిన 175 పనులు తక్షణమే పూర్తి చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొత్తం 8038 పాఠశాలలకు గాను ఇంకా 3681 చోట్ల ప్రహరీలు అసంపూర్తి గా ఉన్నాయన్నారు. ఏపీఈ డబ్ల్యు ఐ డి సి, ట్రైబల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరుగుతున్న వాటిలో అసంపూర్తి గా ఉన్న ప్రహరీల నిర్మాణాలు అన్నీ కూడా జూన్ 20 నాటికి పూర్తి చేయాలన్నారు. ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు.
 
జగనన్న విద్యాకానుక కిట్లపై మంత్రి మాట్లాడుతూ పాఠశాలలకు చేర్చే సమయాల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జూన్ 1 నుంచి సరఫరా ప్రారంభించి జూలై 3వ వారానికి పూర్తి చేసెలా ప్రణాళిక తయారు చేశామని అధికారులు వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్న కారణంగా కొంత సామగ్రి రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యా కానుక లోని అన్ని వస్తువులు జూలై లో అధికారులు చెప్పిన సమయానికి తప్పనిసరిగా చేరేలా చూడాలని మంత్రి సురేష్ ఆదేశించారు. ప్రి ప్రైమరీ పాఠశాలల్లో సిలబస్ విధానం, అకడమిక్ రూట్ మ్యాప్ పై చర్చించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు