జాతీయ రహదారులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా

సోమవారం, 10 జనవరి 2022 (14:54 IST)
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి జాతీయ రహదారులను ఎమ్మెల్యే ఆర్కే రోజా పర్యవేక్షించారు. నగరి నియోజక వర్గంలోని జాతీయ రహదారుల సమస్యలపై రీజనల్ మేనేజర్ కి లేఖ రాసి ప్యాచ్ వర్క్ కు కోటి ఇరవై లక్షల రూపాయలకు మంజూరు తెప్పించడమే కాకుండా, తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుని కలిసి సమస్యలను ఆయన ముందుంచారు. జాతీయ రహదారి ఎన్ హెచ్ -716 (పాత 205) ను ప్రాజెక్ట్ డైరెక్టర్ జనక్ కుమార్, బృందంతో కలసి పర్యవేక్షించారు.
 
 
పుత్తూరులో సగం ఆగి ఉన్న బ్రిడ్జి మీదకు పూర్తిగా నడుచుకుంటూ వెళ్లి పరిస్థితిని వివరించారు. రోడ్డు  మధ్యలో డివైడర్ల‌లో మొక్కల పెంపకం, గార్డెనింగ్ చేయాలని సూచించారు. రోడ్ సేఫ్టీ సమస్యలపై దృష్టి సారించి, రోడ్డుకు ఇరువైపులా సేఫ్టీ బోర్డ్స్ వేయించాలని చెప్పారు. వ‌డమాలపేట మండలంలో వున్న జాతీయ రహదారి విస్తరణ పూర్తిగా అధ్వానంగా ఉందని, పాదిరెడు దగ్గర కదిరిమంగళం దగ్గర ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని, అక్కడ డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.
 
 
పాదిరేడు దగ్గర అసంపూర్తి గా ఉన్న బ్రిడ్జి పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో కేంద్ర ప్రభుత్వ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీని కూడా ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చిన విషయం ఎమ్మెల్యే రోజా గుర్తు చేశారు.
 
 
దీనికి అధికారులు స్పందిస్తూ ప్యాచ్ వర్క్ లకు 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఈ నెల 20 వ తేదీ లోపు పనులు ప్రారంభిస్తారని చెప్పారు. దేవిధంగా పూర్తి రోడ్ పై 145.00 కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ పంపామని, అది 3 నెలల లోపు చేస్తారన్నారు. మల్లవరం, రేణిగుంట, పాడిరెడు, పుత్తూరు పరమేశ్వర మంగళం దగ్గర కల పెండింగ్ పనులు బ్రిడ్జిలు నిర్మించడానికి 153.00  కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారని, ఇవన్నీ కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల లోపు పనులు ప్రారంభం అవుతాయ‌ని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు