ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్‍‌‌ను రద్దు చేయాలంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో సీఎం జగన్ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు గత జూలై నెలలోనే ముగిశాయి. అయితే తీర్పును అప్పటి నుంచి కోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం తీర్పు వెల్లడించింది.
 
అక్రమాస్తుల కేసులో భాగంగా ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలతో, కోర్టుకు గైహాజరవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు