ప్రత్యేక హోదా లేనట్టేనా? ఢిల్లీలో జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారు?

ఆదివారం, 26 మే 2019 (15:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎండమావిగా మారనుంది. తన ప్రమాణ స్వీకారోత్సానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన వైకాపా అధినేత, నవ్యాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశం ఒక్కటే కాదు.. రాష్ట్రానికి అనేక ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయన్నారు. 
 
అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం వదిలిపెట్టబోనని స్పష్టంచేశారు. వాస్తవానికి ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి 250 సీట్లుగాని వచ్చివున్నట్టయితే ఖచ్చితంగా వారికి మన మద్దు అవసరం ఉండేది. అపుడు ప్రత్యేక హోదాపై సంతకం చేస్తానంటేనే మద్దతు ఇస్తామని షరతు విధించేవాళ్ళం. 
 
కానీ, ఇపుడు ఏ ఒక్కరి అవసరం లేకుండానే కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పాటు కానుంది. అందువల్ల  ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని మోడీని పదేపదే అడుగుతూనే ఉంటాం. అడక్కుంటే మాత్రం ఈ అంశం ఇంతటితో మరుగునపడిపోతోంది. ప్రత్యేక హోదా అనేది మన హక్కు అని చెప్పుకొచ్చారు.
 
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సింగిల్‌గా 303 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి కలిపి మొత్తం 353 సీట్లు వచ్చాయి. దీంతో ప్రధాని మోడీ రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు