నల్లబజారులో ఆనందయ్య మందు... పోలీసుల వలయంలో ఆనందయ్య

మంగళవారం, 25 మే 2021 (11:52 IST)
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య ఆయుర్వేదిక్ మందును నిలిపివేసినప్పటికీ బ్లాక్‌లో దందా కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన రవి తన బంధువుల కోసం ఐ డ్రాప్స్‌ను రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. డబ్బు చెల్లించే క్రమంలో రవి స్నేహితుడు సాయి అనే వ్యక్తి ఉచితంగా ఇచ్చే దానికి రూ.20,000 ఎందుకు అని ప్రశ్నించాడు. 
 
దీంతో కృష్ణపట్నం నాగరాజు అనే వ్యక్తి డబ్బులు లాక్కుని పరారయ్యాడు. సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మందు హానికరం కాదని నివేదిక రావడంతో మరింత డిమాండ్ పెరిగింది. దీంతో కృష్ణపట్నంలోకి పోలీసులు ఎవరిని అనుమతించకపోవడంతో... కృష్ణపట్నం గ్రామస్తులు ఫోన్ ద్వారా బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం.
 
మరోవైపు, ఆయుర్వేద వైద్య నిపుణుడు బొణిగ ఆనందయ్య ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉన్నారు. ఆనందయ్యను సీవీఆర్ అకాడమీలోని ఆరవవ బ్లాక్‌లో ఉంచారు. ఆనందయ్యతో పాటు ఆయన కుమారుడు, సోదరుడి కుమారుడు ఉన్నారు. ఆనందయ్యతో మాట్లాడేందుకు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు. 
 
సీవీఆర్ అకాడమీలో ఐసీఎంఆర్ పరీక్షల కోసమంటూ మందు తయారు చేయించి... ఆ మందును పోలీసులు, వైసీపీ నేతలు తీసుకెళ్లారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. మందు పంపిణీలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు