పట్టపగలు నెల్లూరులో గ్యాంగ్ రేప్ - యువతిని కిడ్నాప్ చేసి అఘాయిత్యం

సోమవారం, 12 జూన్ 2023 (08:09 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో పట్టపగలు ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఆ యువతిని తొమ్మిది మంది కామాంధులు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని నలుగురు యువకులు ఆటోలో తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో ఐదుగురు కలిసి మొత్తం తొమ్మిది మంది అత్యాచారం చేశారు. ఆటో నంబరు, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
తన తోబుట్టువు అనారోగ్యంతో బాధపడుతుంటే సాయం చేసేందుకు శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వచ్చింది. అక్కడ సోదరి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఉంటూ సాయం చేస్తూ వచ్చింది. ఆదివారం వైద్యులు రాసిన చీటీ తీసుకుని మందుల కోసం ఆస్పత్రి నుంచి గాంధీ బొమ్మ సెంటరుకు బయులుదేరింది. 
 
ఆమెను గమనించిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఆ యువతిని కిడ్నాప్ చేశారు. నగర శివారు ప్రాంతమైన గొలగమూడి రోడ్డుకు వెళ్లే మార్గంలో ఏ ప్రైవేటు స్కూల్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా మరో ఐదుగురిని పిలిపించి వారితో కూడా ఆ యువతిపై అత్యాచారం చేయించారు. 
 
అటుగా వెళుతున్న కొందరు స్థానికులు ఆ యువతి కేకలు విని, 112కు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకోగానే కామాంధులు యువతిని అక్కడ వదిలివేసి ఆటోతో పాటు పారిపోయారు. బాధితురాలిని పోలీసులు వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల సాయంతో కామాంధులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు