తెలంగాణను అనుసరించిన తమిళనాడు, పుదుచ్చేరి.. టెన్త్ పరీక్షలు రద్దు

మంగళవారం, 9 జూన్ 2020 (17:03 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదని, పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లను నిర్ణయించి పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.
 
పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 
 
పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు. 
 
కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వి. నారాయణ సామి వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి నిర్ణయం తీసుకున్నారు.
 
కరోనా తీవ్రత నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటన చేశారు. బోర్డు ఎగ్జామ్స్ లేకుండానే అందరినీ పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేసి స్టూడెంట్స్‌ను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు