టిటిడి భూములు అయిపోయాయి, దేవదాయశాఖ భూములపై పడ్డారు?

శుక్రవారం, 29 మే 2020 (22:38 IST)
తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తిభావంతో సమర్పించే భూములను అమ్మేందుకు టిటిడి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలోను, ప్రసార మాధ్యమాల్లోను పెద్దఎత్తున రావడంతో టిటిడి వెనక్కి తగ్గింది. భూముల అమ్మకూడదని నిర్ణయం తీసేసుకుంది. ఒక తీర్మానం కూడా చేసేసింది.
 
దీనిపై హిందూ ధార్మిక సంఘాల్లోను, బిజెపి నాయకుల్లోను సంతోషం వ్యక్తమైంది. కానీ ఆ తరువాత దేవదాయశాఖ భూములపై పోరాటం చేసేందుకు బిజెపి, హిందూ ధార్మిక సంఘాలు ప్రయత్నం ప్రారంభించాయి. దేవదాయశాఖకు చెందిన భూములు ఎపిలో ఎక్కడెక్కడ ఉన్నా సరే వాటిని పరిరక్షించాలని, ఆ భూములను ప్రభుత్వం అమ్మకుండా చట్టం తీసుకురావాలన్నది హిందూ ధార్మిక సంఘాల డిమాండ్.
 
ఇదే విషయంపై పోరాటం చేసేందుకు సిద్థమవుతున్నాయి హిందూ ధార్మిక సంఘాలు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం కూడా అందజేసిన హిందూ ధార్మిక సంఘాలు దేవదాయశాఖా మంత్రి వెంటనే స్పందించకుంటే మాత్రం కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయం తీసేసుకున్నారు.
 
ఎపిలో దేవదాయశాఖకు చెందిన భూములు ఎన్నో ఉన్నాయని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే కబ్జా చేసిన భూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని తిరిగి దేవదాయశాఖకు చెందేలా చర్యలు తీసుకోవాలన్నది హిందూ ధార్మిక సంఘాల డిమాండ్. ఈ పోరాటమే ప్రారంభమైతే ఎపిలో మరో వారంరోజుల పాటు ఇదే హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు