ఆంధ్రలో కాంగ్రెస్‌ను పైకి లేపుతానంటున్న చాందీ... అంతా అదోలా చూస్తున్నారు...

గురువారం, 7 జూన్ 2018 (14:38 IST)
2014లో ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలుగా చేసి, దానికి ప్రతిగా దేశంలో అన్నిచోట్ల అధికారాన్ని కోల్పోయి చతికలపడ్డ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మేల్కొన్నట్లుంది. ఒకవైపు తెలంగాణలో ప్రతిపక్షంగా కొనసాగుతున్నప్పటికీ, ఆంధ్రలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 2014 ఎన్నికలలో కనీసం ఆ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులే కరువయ్యారంటే, దానిపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమౌతుంది. ఆంధ్రలో కనీసం 1 అసెంబ్లీ సీటుని కూడా గెలుపొందకపోగా డకౌట్ అయింది. 
 
ఇప్పటికే బాబు, జగన్ నువ్వా నేనా అన్నట్లు కాలుదువ్వుతున్నారు. మరోపక్క బీజేపీ, జనసేనలు కూడా 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఎన్నికలు బీజేపీ ఆధిపత్యంపై కొంత ప్రభావాన్ని చూపడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ నియమితులయ్యారు. 
 
ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెస్తానని, అంతేకాకుండా అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామంటూ, ఎలాగైనా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. నిండా మునిగిన పార్టీని తను ముందుకు నడిపిస్తానని చెప్పడంతో అంతా అదోలా చూస్తున్నారు. మరి ఆయన నమ్మకం ఏమిటో తెలియాలంటే 2019 ఎన్నికల దాకా చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు