ఇజ్రయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ సింధు పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ అపరేషన్ సింధు ద్వారా ఇప్పటివరకు 1750 మంది భారతీయ పౌరులను స్వదేశానికి వచ్చారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు మంగళవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని భారత్కు తీసుకొచ్చింది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధు పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిద్వారా ఇప్పటివరకు సుమారు 1750 మంది భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. తాజాగా ఇరాన్లో ఉన్న పది మంది ఏపీ విద్యార్థులు కూడా ఈ ఆ పరేషన్ ద్వారా ఢిల్లీకి క్షేమంగా చేరుకున్నారు.
ఇరాన్, ఇజ్రాయిల్ నుంచి తిరిగి వస్తున్న భారతీయుల కోసం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లుచేశాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, తెలంగాణ భవన్లలో వీరికి వసతి సౌకర్యాలు కల్పించారు. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులను వారి వారి స్వస్థాలకు పంపించేందుకు రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు ప్రత్యేకంగా రెండు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు విద్యార్థులతో సమన్వయం చేసుకుంటూ వారి ప్రయాణ ఏర్పాట్లకు పర్యవేక్షిస్తున్నారు.