అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ మాట్లాడారు. '' 26 మంది అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతోంది. కానీ ఆ దేశం నమో మిసైల్ ను చూస్తే భయపడుతోంది. నమో అంటే ఇంకెవరో కాదు... మన నరేంద్ర మోడి. ఆయన కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుంది. వంద పాకిస్తాన్ దేశాలు కలిసి వచ్చినా భారతదేశాన్ని ఏమీ చేయలేరు అంటూ చెప్పారు నారా లోకేష్.
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ''అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కల్యాణ్ కృషితో అమరావతి నగరం అధునాతన నగరంగా మారుతుంది. వచ్చే 3 సంవత్సరాల తర్వాత సంపూర్ణంగా పూర్తయిన అమరావతి నగరానికి వస్తాను. ఇక్కడ ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏపీ-తెలంగాణకు కలిపి రైల్వే బడ్జెట్ రూ.900 కోట్లు లోపు ఇచ్చేవాళ్లం. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రూ. 9 వేల కోట్లు నిధులను ఇచ్చాము.
అమరావతి ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైలు మార్గం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి సాయం చేస్తుంది. చంద్రబాబు గారు నేనేదో టెక్నాలజీ పరంగా దూసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఐతే గతంలో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాదులో అప్పుడు సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారన్నది దగ్గరగా చూసాను. టెక్నాలజీకి సంబంధించి ఆలోచనలు చేయడంలో బాబును మించినవారు ఎవ్వరూ లేరని చెప్తాను.