పరకాల ప్రభాకర్ టిడిపిలో చేరారా..? ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటున్నారే?

సోమవారం, 29 మే 2017 (21:41 IST)
పరకాల ప్రభాకర్ వైజాగ్‌లో జరిగిన మహానాడులో ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. పరకాల తీర్మానం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలెందుకు టిడిపి నేతలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం వచ్చింది. వైజాగ్‌లో జరుగుతున్న మహానాడులో పరకాల ప్రభాకర్ హోదా ఏమిటి అన్న విషయమై విస్తృతంగా చర్చ మొదలైంది.
 
చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే పరకాలను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. గడచిన మూడేళ్ళుగా పరకాల ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ పర్యటించినా ఆయన హోదా మాత్రం ప్రభుత్వ సలహాదారే. ఆయన పనేంటంటే వివిధ అంశాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటమే. అంతేకానీ పార్టీకి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. అయితే, విశాఖపట్నంలో మొదలైన మహానాడు కార్యక్రమంలో ఆదివారం నాడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ పార్టీ ఓ తీర్మానం చేసింది. ఇక్కడ జరుగుతున్నది పార్టీ కార్యక్రమం అన్న విషయం మరచిపోకూడదు. అంటే ప్రభుత్వంలో అధికార బాధ్యతల్లో ఉన్న వారు ఎవరు కూడా కూడా ఇందులో పాల్గొనేందుకు లేదు.
 
ఎన్టీఆర్ కు భారతరత్నం ఇవ్వాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరో పార్టీ నేత కాదు. స్వయంగా పరకాల ప్రభాకరే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడే అందరకీ సందేహం మొదలైంది. ప్రభుత్వ సలహాదారు అనే అధికారిక పదవిలో ఉన్న పరకాల పార్టీ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు?
 
సరే వేలాది మంది హాజరైన కార్యక్రమం కాబట్టి ఏదోలే అభిమానం కొద్దీ పాల్గొన్నారని అనుకోవచ్చు. కానీ ఏకంగా తీర్మానాన్నే ప్రవేశపెట్టడమేంటి అన్న సందేహం అందరిలోనూ మొదలైంది. అయితే, పరకాల టిడిపిలో చేరారేమో అందుకనే వేదికపైన కూర్చున్నారు అని ఎవరికి వారు సమాధానం చెప్పుకున్నారు. ప్రస్తుతం పరకాల ప్రభాకర్ చర్చే మహానాడులో హాట్ టాపిక్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి