నాకేమీ ఒళ్లు బలిసి అన్ని పెళ్లిళ్లు చేసుకోలేదు... జగన్ వ్యాఖ్యలపై పవన్

గురువారం, 26 జులై 2018 (20:22 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగత వ్యా‍ఖ్యలపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తనకు ఒళ్లు బలిసి పెళ్లిళ్లు చేసుకోలేదని అన్నారు. దాని వెనుక వున్న సమస్యలు మీకేమి తెలుసునని ప్రశ్నించారు. జగన్ వ్యా‍ఖ్యలు తన అభిమానులను, జనసైనికులను బాధించాయన్న పవన్‌ ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని కోరారు. ఈ వివాదంలోకి జగన్‌ కుటుంబసభ్యులను కానీ, ఆ ఇంటి ఆడపడుచులను కానీ వివాదంలోకి లాగొద్దని జనసేన నేతలకు, కార్యకర్తలకు సూచించారు.
 
తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాల్లేవన్న జనసేనాని రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లబోనన్నారు. కేవలం విధివిధానాలపైనే పార్టీలతో విభేదిస్తానన్నారు. అంతకుముందు తనపై జగన్ చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేరన్నారు. రాజకీయాలు చేసేందుకు వేల కోట్లు అవసరం లేదని, గూండాలు అక్కర్లేదని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోందని పవన్ కల్యాణ్ అన్నారు. 
 
తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరు. పారిపోతారు. అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావని పవన్ చెప్పారు. ఇసుక మాఫియా, దోపిడీలు చేసే నాయకులకే ఇంత ధైర్యం ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకెంత తెగింపు ఉండాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మెతక అనుకునేరు.. తాటతీస్తానంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు