తిరుపతి - శ్రీశైలం భూముల రెన్యువల్ అంశం సీఎం దృష్టికి : పవన్

ఠాగూర్

శుక్రవారం, 9 ఆగస్టు 2024 (08:57 IST)
తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో ఉన్న కర్నాటక భూముల రెన్యువల్‌కు సంబధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు కర్నాటక ప్రభుత్వానికి ఆయన హామీ ఇచ్చారు. ఆయన గురువారం బెంగుళూరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్నాటక అటవీ శాఖామంత్రి ఈశ్వరల్‌తో అనేక అంశాలపై చర్చించారు. 
 
ఆ తర్వాత కర్నాటక మంత్రి ఈశ్వర్‌తో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్ర భూములు ఉన్నాయని, వాటి పునరుద్ధరణ (రెన్యువల్)కు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుకు వివరిస్తానని, త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, అవి భారతదేశం మొత్తానికి చెందిన వారసత్వ సంపద అని స్పష్టం చేశారు.
 
మనం రాజకీయ పార్టీలుగా వేర్వేరు కావచ్చు... కానీ మనం అంతా ఒకే దేశ ప్రజలం, ఒకే సంస్కృతికి చెందినవాళ్లం అని పవన్ కల్యాణ్ వివరించారు. భూమి అనేది కేవలం మనుషులదే కాదు... అన్ని జంతువులది, జీవ జాతులకు కూడా చెందినది... వసుధైక కుటుంబం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పర్యావరణాన్ని, అడవులను పరిరక్షించుకోవాలని అన్నారు. తాను డిప్యూటీ సీఎం పదవిలోకి రాకముందు నుంచి ప్రకృతి సంరక్షకుడుని, ఇప్పుడు అటవీశాఖ మంత్రిగా తనపై మరింత బాధ్యత ఉందని భావిస్తానని తెలిపారు.
 
ఇక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తనకు కన్నడ భాష అంటే చాలా ఇష్టం అని, సరిహద్దులు పంచుకుంటున్నప్పటికీ కన్నడ భాషలో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. కన్నడ భాష నేర్చుకుని హృదయం లోతుల్లోంచి మాట్లాడాలని ఉందని పేర్కొన్నారు. కాగా, తన ఒక రోజు బెంగుళూరు పర్యటన ముగించుకుని ఆయన గురువారం రాత్రికి అమరావతికి చేరుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు