అనవసరంగా కొందరిని పెద్దవాళ్లను చేయకండి: కత్తిపై పవన్ సెటైర్లు

శనివారం, 9 డిశెంబరు 2017 (12:29 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్‌ కత్తి మహేష్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తూ.. బెదిరింపులు పోస్టు చేస్తున్నారు. దీనిపై మహేష్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పవన్‌పై మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కత్తికి, పవన్ ఫ్యాన్సుకు వార్ జరుగుతోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ కత్తిపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. అనవసరంగా కొందరిని పెద్దవాళ్లను చేయొద్దని ఫ్యాన్సుకు, కార్యకర్తలకు సూచించారు. ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు పట్టించుకోవద్దన్నారు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కొన్ని రోజుల తర్వాత అనవసరంగా కొందరిని పెద్దమనిషిని చేశామనే ఫీలింగ్ రాకతప్పదన్నారు. తనపై విమర్శలు గుప్పించిన వారైనా, తాను విమర్శలు చేసిన వారైనా ఎక్కడైనా ఎదురుపడితే బాగానే మాట్లాడుకుంటామని పవన్ తెలిపారు. 
 
ఇలాంటి వాటిని పట్టించుకోకూడదని, తాను బంగారం కాదని, మనిషినేనని జనసేనాని వివరించారు. తనను ద్వేషించే వ్యక్తులు వారి అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లేనని పవన్ చెప్పుకొచ్చారు. మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయి. అదే ద్వేషిస్తే మాత్రం శరీరం పాడవుతుందని అన్నారు. అందుచేత కార్యకర్తలు, ఫ్యాన్స్ సహనంతో వుండాలన్నారు. 
 
కానీ మనం చచ్చిపోయేంత సహనం మాత్రం అవసరం లేదని పవన్ సూచించారు. అంతటి సహనాన్ని తాను కూడా భరించలేనని చెప్పుకొచ్చారు. మనం చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదని... అదే సమయంలో ఎదురుదాడి చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అవసరమైన సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకుందామని పవన్ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు