భావితరాలకు నా పిల్లల భవిష్యత్‌ను తాకట్టు పెట్టాను : పవన్ కళ్యాణ్

గురువారం, 26 జనవరి 2023 (15:31 IST)
తన పిల్లల భవిష్యత్‌ను తాకట్టుపెట్టి భావితరాల భవిష్యత్ కోసం పాటుపడుతున్నానని జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. భారత గణతంత్ర 74వ వేడుకలను పురస్కరించుకుని ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగఫలితమే ఈ రోజు మనమంతా భారతీయులమని గర్వంగా చెప్పుకుంటూ జీవిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు గ్రహీతల్లో తమకు వ్యక్తిగతంగా తెలిసిన వారు ఉండటం సంతోషంగా ఉందన్నారు. 
 
ఇకపోతే, తన పిల్లల భవిష్యత్ గురించిన ఆలోచనను పక్కనబెట్టి భావితరాల భవిష్యత్ కోసం జనసేన ఆఫీసును నిర్మించానని చెప్పారు. తనకేమన్నా అయితే తన పిల్లలు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో రూ.3 కోట్లు జమచేసి వాటిని పిల్లలకు ఉద్దామని అనుకున్నానని, ఆ సమయంలో భావితరాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పిల్లల కోసం దాచిన రూ.3 కోట్లను పార్టీ నిర్మాణం కోసం, జనసేన బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టానని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోమారు విమర్శలు గుప్పించారు. 'మీరు సెల్యూట్ కొట్టే ముఖ్యమంత్రికి మీపైన, మీ వ్యవస్థపైనా గౌరవం లేదు' అంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ టీనేజ్లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత జగన్‌కు ఉందన్నారు.
 
కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ జగన్ చేతుల్లో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం మానవ హక్కులకు సంబంధించిన దాంట్లో ఉంటుందన్నారు. వైసీపీ నేతలు ప్రజలకు బాధ్యతగా ఉండక్కర్లేదని అనుకుంటున్నారు.. కానీ మీ మెడలు వంచి జవాబు చెప్పిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనతో సహా ఎవరినీ గుడ్డిగా ఆరాధించొద్దని అభిమానులకు పవన్ కళ్యాణ్ సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు