పవన్ కళ్యాణ్ గారూ ఇది మనం చేయాలి.. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి. వికసిత ఏపీ కోసం స్వర్గీయ ఎన్టీఆర్ కలలుగన్నారు. మనమంతా కలిసి ఆయన కలల్ని నిజం చేయాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన సుధీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగాన్ని ఆయన తెలుగులో ప్రారంభించారు. దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి ఒక నగరం కాదన్నారు. ఒక శక్తి అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.3 వేల కోట్ల సాయం చేస్తోందన్నారు. ఇపుడు నేను ఈ పుణ్యభూమి అమరావతిపై నిలబడివున్నపుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు... ఒక స్వప్నం సాకారం కాబోతుందనే భావన కలుగుతుందన్నారు. దాదాపు 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్టు తెలిపారు.
పవన్ కళ్యాణ్కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సభావేదికపై కూర్చొన్న వారంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం శుక్రవారం అమరావతిలో జరిగింది.
ఈ పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని పనును బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్య నేతలందరూ సభా వేదికపై ఆశీనులై ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తన వద్దకు పిలించారు. ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావుడిగా ఆయన వద్దకు వచ్చారు.
అపుడు మోడీ తన వద్ద ఉన్న చాక్లెట్ను పవన్కు ఇవ్వడంతో వేదికపై నవ్వులు విరబూశాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నవ్వడంతో, పవన్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ను చూసుకుని వారితో కలిసి తాను కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.