విగ్రహాలు ధ్వంసంపై ఏపీలో పోలీసు శాఖ అప్రమత్తం

సోమవారం, 4 జనవరి 2021 (15:47 IST)
అమరావతి: ఇటీవల దేవాలయాలకు సంబంధించిన వరుస ఘటనల దృష్ట్యా ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రాష్ట్ర పోలీస్‌శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్‌, విజిబుల్‌ పోలీసింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని, అర్చకులు, పూజారులు ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని పోలీసులకు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎల్లవేళలా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
ప్రతి ఒక్క దేవాలయాన్ని జియో ట్యాగింగ్‌ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ..
 
 శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు