తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

ఠాగూర్

శుక్రవారం, 17 మే 2024 (10:06 IST)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని వారి నివాసంలో నిత్యం వందల మందికి వారు భోజనాలు పెడతారు. అలాంటిది.. తాడిపత్రి పోలీసుల చర్యల కారణంగా వారికే భోజనం పెట్టేవారు కరవయ్యారు. 
 
ఈ నెల 14వ తేదీన తాడిపత్రిలో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి జరిగిన అనంతరం.. అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణలు మొదలయ్యాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. తాడిపత్రికి వచ్చిన రాజంపేట డీఎస్పీ చైతన్య.. జేసీ ఇంట్లో పని మనుషులందరినీ అరెస్టు చేశారు. వారి ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. దివాకర్ రెడ్డి భార్య విజయమ్మ, సోదరి సుజాతమ్మ కొద్దికాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. 
 
వీరికి సమయానికి మందులు, భోజనం అందించే సిబ్బందిని మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన తల్లి, మేనత్తల బాగోగులు చూసుకునేందుకు దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి గురువారం తాడిపత్రికి రాగా.. పోలీసులు ఆయనపై సైతం ఆంక్షలు విధించారు. 'మీరు తాడిపత్రిలో ఉండకూడదు. ఉంటే గృహ నిర్బంధం చేస్తాం' అని పోలీసులు హెచ్చరించారు. తనపై ఆంక్షలు విధించడం సరికాదని పవన్ వాదించినప్పటికీ.. పోలీసులు వినిపించుకోలేదు. చేసేదిలేక కుటుంబ సభ్యులను పవన్ హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు