జనసేనకు దరఖాస్తుల వెల్లువ.. అర్హత పరీక్ష ద్వారా సెలక్షన్స్... అనంతపురం నుంచే స్టార్ట్స్..

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:46 IST)
జనసేన ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆశ్రిత పక్షపాత అవలక్షణాలను తుంచివేసి... కొత్త తరానికి ప్రాతినిథ్యం కల్పించే నిమిత్తం ఈనెల 21 తేదీ నుంచి జనసేనకు నిర్వాహకుల ఎంపికలు చేపట్టనుంది. ఇదే అంశంపై ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుద చేశారు. ఈ ప్రకటనలో... 
 
"రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువకులు, మేధావులను భాగస్వాముల్ని చేసే ఒక అభ్యుదయ ప్రయత్నానికి ఈనెల 21వ తేదీన అనంతపురంలో జనసేన శ్రీకారం చుడుతోంది. రాజకీయాల్లో అనువంశిక, ఆశ్రిత పక్షపాత అవలక్షణాలును తుంచివేసి, కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించడానికి తలపెట్టిన ఈ క్రతువును అత్యంత పవిత్రంగా, శ్రద్ధతో జరపాలని జనసేన కృతనిశ్చయంతో ఉంది. 3600 దరఖాస్తులు రావడంతో మూడు రోజుల పాటు అర్హత పరీక్ష జరపాలని నిర్ణయించాము. 
 
జనసేనకు చెడ్డపేరు తేవాలని తలచేవారు ఈ పవిత్ర యజ్ఞంలో చొరబడకుండా జనసైనికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎంపికలు అత్యంత పారదర్శకంగా, ప్రతిభకు పట్టం కట్టేవిధంగా జరుగుతాయి. ఈ దిగువ తెలిపిన చిరునామాలో ఎంపికలు జరుగుతాయి. ఎంపిక చేసిన సమయం, మిగిలిన వివరాలను దరఖాస్తుదారులకు ఈ-మెయిల్‌లో ద్వారా జనసేన ప్రతినిధులు తెలియజేస్తారు. రాత పరీక్షలు జరిగే స్థలం.. జీఆర్ గార్డెన్స్, గొంగడి రామప్ప కాంపౌండ్, 3వ రోడ్ ఎక్స్‌టెన్షన్, ఈస్ట్ గేట్, అనంతపురం 515 004 అనే చిరునామాలో జరుగుతుందని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి