ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు : పురంధేశ్వరి

ఠాగూర్

సోమవారం, 4 మార్చి 2024 (11:02 IST)
తమ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఆ తర్వాత పురంధేశ్వరి మాట్లాడుతూ, ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తంటూ ఉంటే ఆ విషయాన్ని తమ పార్టీ పెద్దలే అధికారికంగా ప్రకటిస్తారన్నారు. 
 
తాము మాత్రం మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని, తమ జాబితాను రెండు రోజుల్లో హైకమాండ్‌కు పంపుతామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 వేల మంది వరకు అభ్యర్థులు వచ్చారని, వీరిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని చెప్పారు. తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలను తీసుకుంటామన్నామని, త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు. 
 
కొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. మరోవైపు, టీడీపీ, జనసేన పార్టీ మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. రెండు పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి. అయితే, బీజేపీతో ఈ పార్టీల పొత్తుపై ఇంత వరకు ఏమీ తేలలేదు. పొత్తు దిశగా బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలోనే పురంధేశ్వరి పై విధంగా మాట్లాడటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు