డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం కావాల్సిందే... హైకోర్టు ఆదేశం

బుధవారం, 20 మే 2020 (12:38 IST)
డాక్టర్ సుధాకర్ పట్ల వైకాపా ప్రభుత్వంతో పాటు విశాఖ పోలీసులు ప్రవర్తించిన తీరుపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సుధాకర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకుని గురువారం సాయంత్రంలోగా తమకు అందజేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టులు ఉత్తర్వులు జారీచేసింది. 
 
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ సీఎం జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసే విషయంలో ఎన్95 రకం మాస్కులుగానీ, పీపీఈ కిట్లుగానీ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. దీంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 
 
ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై ఆయన గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం అలజడి రేపింది. ఆ తర్వాత సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. అయితే, సుధాకర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... సుధాకర్‌ను తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. అలాగే, ఆయన వాంగ్మూలాన్ని గురువారం సాయంత్రంలోగా తమకు అందజేయాలని ఉత్తర్వులు జారీచేస్తూ, కేసు విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు